ఓదార్చేవారు కరువయ్యారు నాన్నా.. అంటూ తండ్రితో మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకున్న ఇంజినీరింగ్ విద్యార్థిని

  • జీవితంపై విరక్తి పెంచుకున్న ఇంజినీరింగ్ విద్యార్థి
  • తండ్రితో మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకుంటున్నట్టు చెప్పిన కుమార్తె
  • తండ్రి వచ్చేసరికే జరిగిపోయిన ఘోరం
జీవితంపై విరక్తి చెందిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని తండ్రితో మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లో జరిగింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి పోలీసుల వివరాల ప్రకారం.. అండమాన్ నికోబార్ రాజధాని పోర్ట్ బ్లెయిర్‌కు చెందిన షమాదిన్ (21) హైదరాబాద్ షేక్‌పేటలోని నారాయణమ్మ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ నాలుగో తరగతి చదువుతోంది.

ఏడాదిగా జీవితంపై విరక్తి పెంచుకున్న ఆమె శనివారం రాత్రి  తండ్రితో ఫోన్‌లో మాట్లాడుతూ ఒక్కసారిగా కళాశాల నాలుగో అంతస్తు నుంచి దూకేసి ఆత్మహత్య చేసుకుంది. తండ్రి మహమ్మద్‌తో మాట్లాడుతూ జీవితంపై విరక్తి కలుగుతోందని, తనకు బతకాలని లేదని తండ్రితో పేర్కొంది. ప్రేమంటే ఏంటో అంతా అయోమయంగా ఉందని, ఓదార్చేవారు కరువయ్యారని, చనిపోతున్నానంటూ ఫోన్ విసిరేసి కిందికి దూకేసింది.

తీవ్ర గాయాలపాలైన షమాదిన్‌ను వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. కుమార్తె ఫోన్‌తో ఆందోళనతో నగరానికి చేరుకున్న మహమ్మద్, కుమార్తె మృతదేహాన్ని చూసి బోరున విలపించారు.
Go Back to Shorts
Hyderabad
Student
Suicide

More Telugu News